లండన్ : పిల్లలపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్కు బ్రేక్ పడింది. వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడానికి సంబంధం ఉందని మెడికల్ రెగ్యులేటరీలు అంచనా వేసిన నేపథ్యంలో ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేసిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తెలిపింది. ‘పిడియాట్రిక్ క్లినికల్ ట్రయల్స్లో ఎలాంటి భద్రతా సమస్యలు లేనప్పటికీ.. పెద్దవారిలో నివేదించిన ‘థ్రోంబోసిస్’ (థ్రోంబోసైటోపెనియా) అరుదైన కేసుల సమీక్షపై బ్రిటన్ మెడికల్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) నుంచి అదనపు సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రులు, పిల్లలు అన్ని షెడ్యూల్ మేరకు హాజరు కావాలని, వారికి ఏవైనా ప్రశ్నలు ఉంటే ట్రయల్స్ సైట్లను సంప్రదించవచ్చని సూచించింది.
బ్రిటన్ మెడిసిన్స్ రెగ్యులేటరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థల్లో ఒకటి. నార్వే, ఐరోపా ఖండంలో ప్రాథమికంగా గుర్తించిన కేసుల్లో రక్తం గడ్డకట్టడానికి వ్యాక్సిన్కు ఏవైనా సంబంధం ఉందా? అని తెలుసుకునేందుకు డేటాను విశ్లేషిస్తోంది. డబ్ల్యూహెచ్ఓతో పాటు, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) సైతం ఈ వారం చివరలో తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. బ్రిటన్లో 18 మిలియన్ డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వగా.. 30 మందిలో రక్తం గడ్డకట్టగా.. ఇందులో ఏడుగురు మరణించారని ఇటీవల బ్రిటన్ మెడిసిన్స్ రెగ్యులేటరీ ప్రకటించింది. యూరోపియన్ యూనియన్స్ మెడిసిన్స్ ఏజెన్సీ ‘ఇంకా నిర్ణయానికి రాలేదని, ప్రస్తుతం సమీక్ష కొనసాగుతుంది’ అని పేర్కొంది.