న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను మరింత విస్తృతం చేయడానికి కేంద్రం నిర్ణయించింది. చిన్నారుల కోసం హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజాలు బయలాజికల్ ఈ అభివృద్ధి చేసిన కార్బివ్యాక్స్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్రఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం వెల్లడించారు.
కార్బివ్యాక్స్ టీకాను 5-12 ఏండ్ల పిల్లలకు, కొవాగ్జిన్ టీకాను 6-12 ఏండ్ల పిల్లలకు ఇస్తారు. మరోవైపు, 12 ఏండ్లు దాటిన చిన్నారుల కోసం జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్-డీ 3ఎంజీ అదనపు డోసు టీకాకు కూడా డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులనిచ్చింది. 28 రోజుల ఎడంతో ఈ టీకాను రెండు డోసులుగా వేసుకోవాలి. గతంలో జైకోవ్-డీ 2ఎంజీ టీకాకు మాత్రమే డీసీజీఐ అనుమతులనిచ్చింది. దీంతో ఈ టీకాను మూడు విడుతలుగా వేసుకోవాల్సి వచ్చేది. కాగా ఇప్పటివరకూ 12 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే దేశంలో టీకాలు వేస్తున్నారు. తాజా అనుమతుల మంజూరుతో ఐదేండ్లు పైబడిన పిల్లలకు త్వరలోనే వ్యాక్సినేషన్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.