అలహాబాద్, సెప్టెంబర్ 11: దేశంలో కోర్టులు ఇప్పటికీ కనీస సదుపాయాల్లేకుండా, శిథిలావస్థకు చేరుకొన్న భవనాల్లో పనిచేస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అందుకే నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఎన్జేఐసీ) ఏర్పాటు అవశ్యమని పునరుద్ఘాటించారు. శనివారం ఆయన అలహాబాద్లో యూపీ నేషనల్ లా యూనివర్సిటీ, అలహాబాద్ హైకోర్టులో కొత్త భవన కాంప్లెక్సు నిర్మాణాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కలిసి శంకుస్థాపనచేశారు. అలహాబాద్ హైకోర్టులో క్రిమినల్ కేసులు భారీగా పెండింగ్ ఉండటంపై జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త భవనంతో ఈ సమస్య కొంత తీరుతుందన్నారు.
గొప్ప ధైర్యంతో కూడుకొన్న తీర్పు అది
1975లో ప్రధాని ఇందిరాగాంధీపై అలహాబాద్ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై జస్టిస్ రమణ ఈ సందర్భంగా మాట్లాడారు. జస్టిస్ జగ్మోన్లాల్ సిన్హా తీర్పు గొప్ప ధైర్యంతో కూడుకొన్నదని పేర్కొన్నారు. ఈ తీర్పు దేశాన్ని కుదిపేసిందని చెప్పారు.
కొత్త చరిత్ర సృష్టించాం
సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళలు సహా ఒకేసారి తొమ్మిది మంది జడ్జిలను నియమించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించినట్టు అయిందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. ఈ నిర్ణయంతో సుప్రీంకోర్టుకు ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి అయ్యే వీలు కలిగిందన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఇంతకుముందెన్నడూ లేరని చెప్పారు. రాజ్యాంగ ఆశయాలను నెరవేర్చడానికి న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్నారు.