న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రజలకు న్యాయం అందించడం కోర్టుల విధి మాత్రమే కాదని, కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలకు రాజ్యాంగం సమానమైన బాధ్యత కల్పించిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ పంపిణీ కోర్టుల బాధ్యతేనన్న భావనను రాజ్యాంగం తొలగిస్తుందని, అందుకే న్యాయం అందించడం అనేది ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ బాధ్యత, విధి అని పేర్కొన్నారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తితో ఉండాలని అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జస్టిస్ రమణ సోమవారం సుప్రీంకోర్టు ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విధాన నిర్దేశిక సూత్రాలకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 38ను ప్రస్తావించారు. దీని ప్రకారం సామాజికంగా, న్యాయ, ఆర్థిక, రాజకీయపరంగా సామాజిక క్రమాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.