Fact check | అత్యాచారం కేసులో యూపీలోని కాన్పూర్ కోర్టు ఇటీవల ఒక తీర్పును వెలువరించింది. 2017లో 17 ఏండ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జావెద్ అలియాస్ మున్నా అనే వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అతనికి పదేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 10వేల జరిమానా విధించింది. అయితే లవ్ జిహాద్ చట్టం కింద వెలువడిన తొలి తీర్పు ఇదేనని డిసెంబర్ 22న నమస్తే తెలంగాణ వెబ్సైట్లో తప్పుగా ప్రచురించడం జరిగింది. ఈ కేసు లవ్ జిహాద్ కిందకు వర్తించదు.
నిజానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో మొదటిసారి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది. 2021లో చట్టంగా చేసింది. అయితే కాన్పూర్ కోర్టు ఇచ్చిన తీర్పు 2017లో జరిగిన కేసుకు సంబంధించినది. భారత రాజ్యాంగంలోని 20(1) ప్రకారం గతంలో జరిగిన నేరాలను.. కొత్తగా తీసుకొచ్చిన చట్టాల కింద విచారించడం గానీ, శిక్షించడం గానీ కుదరదు. కాబట్టి ఈ కేసుకు.. లవ్ జిహాద్ చట్టం వర్తించదు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. నిందితుడు జావెద్ అలియాస్ మున్నా తన స్నేహితురాలి అన్నయ్య అని బాధితురాలు తన స్టేట్మెంట్లో చెప్పింది. అంటే నిందితుడు తన మతాన్ని దాచిపెట్టాడన్న వాదన కూడా తప్పే.