న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా విమానంలో మూత్ర విసర్జన కేసులో నిందితుడైన శంకర్ మిశ్రా బెయిల్ పిటిషన్పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతేడాది నవంబర్ 26న శంకర్ మిశ్రా తప్పతాగి విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బెయిల్పై విచారణ సందర్భంగా శంకర్ మిశ్రా తరఫున న్యాయవాది మను శర్మ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్లో ఒకటి మాత్రమే నాన్ బెయిలబుల్ కేసుందని, మరికొన్ని బెయిలబుల్ నేరాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. మరో వైపు శంకర్ మిశ్రా బెయిల్ పిటిషన్ను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు.
నిందితుడు బెయిల్పై విడుదలైతే ఫిర్యాదుదారుడిని ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో జనవరి 4న ఢిల్లీ పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ఐజీఐ పోలీస్స్టేషన్ సిబ్బంది 7న బెంగళూరులో అరెస్టు చేసి ఆ తర్వాత ఢిల్లీకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కోర్టు నిందితుడు మిశ్రాను మూడు రోజుల కస్టడీని కోరగా.. కోర్టు అతనికి 14 జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నడి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన సీటు వద్ద మూత్ర విసర్జన చేసినట్లు ఓ వృద్ధ ప్రయాణికురాలు ఎయిర్ ఇండియా చైర్మన్కు రాసిన లేఖలో ఆరోపించారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఫిర్యాదు మేరకు నిందితుడు శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు.