బెంగళూరు: అటవీ ప్రాంతంలోని రిసార్ట్లో బస చేసిన దంపతులు తమ కుమార్తెను చంపారు. ఆ తర్వాత వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని కొడగులో ఈ సంఘటన జరిగింది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే కొడగు అటవీ, కొండ ప్రాంతంలోని రిసార్ట్లో శనివారం ఒక కుటుంబం బస చేసింది. అయితే ఆ కుటుంబంలోని ముగ్గురు ఆ రిసార్ట్లో అనుమానాస్పదంగా మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను 43 ఏళ్ల వినోద్, 37 ఏళ్ల భార్య జుబీ అబ్రహం, 11 ఏళ్ల కుమార్తె జోహాన్గా గుర్తించారు.
కాగా, తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు రాసి ఉన్న నోట్ను ఆ రిసార్ట్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.
తొలుత కుమార్తెను చంపిన దంపతులు ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మృతులు కేరళలోని కొట్టాయంకు చెందిన వారని తెలిపారు. వారి మరణం గురించి బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. వారి రాక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.