ముంబై: సహజీవనం చేస్తున్న జంట పసిబిడ్డను హత్య చేశారు. (Couple kills toddler) చిన్నారి మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారు. కిడ్నాప్ అయ్యినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వారి నాటకం బయటపడింది. దీంతో ఆ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఒడిశాకు చెందిన 28 ఏళ్ల రాజేష్ రాణా, ముంబైలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల రింకీ దాస్ తన ఏడాదిన్నర బిడ్డతో కలిసి నాలుగు నెలల కిందట ముంబై చేరుకుని రాజేష్ను కలిసింది. జోగేశ్వరి ప్రాంతంలోని ఓ నిర్మాణ స్థలంలో కలిసి నివసిస్తున్న వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
కాగా, పసిబిడ్డను కిడ్నాప్ చేసినట్లు రాజేష్, రింకీ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే రాజేష్ ఆ చిన్నారిని దారుణంగా కొట్టి చంపినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. పసిబిడ్డ మృతదేహాన్ని సమీపంలోని మురుగు కాలువలో ఆ జంట పడేసినట్లు గుర్తించారు. దీంతో రాజేష్, రింకీని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిని హత్య చేసిన రాజేష్ను పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించింది.