Yogi Adityanath Fires Congress | ఉగ్రవాదానికి మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. శ్రీరాముడిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఆ పార్టీ కించ పరిచిందని ఆరోపించారు. ఆదివారం ఆయన కుషినగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సందర్భంగా జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి మాతృమూర్తి. దేశానికి నష్టం కలిగిస్తున్న వారిని సహించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వ్యాధులు తీసుకొస్తుంది. శ్రీరాముడి పట్ల విశ్వాసాన్ని కించపరుస్తుంది. మాఫియాకు షెల్టర్ ఇస్తుంది. కానీ ప్రజలకు అయిన గాయాలను బీజేపీ నయం చేస్తుంది. వారి కష్టాలు పరిష్కరిస్తుంది. బీజేపీ ఉన్న చోటే ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుంది అని పేర్కొన్నారు.
వ్యాధులు, నిరుద్యోగం, మాఫియా రాజ్యం, అవినీతి కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిందేమిటి. ప్రధాని మోదీ నాయకత్వంలో బుజ్జగింపు రాజకీయాలకు చోటు లేదు. 2017కు ముందు ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందేవా.. పాలకులకు జై కొట్టిన వారికే రేషన్ సరుకులు ఇచ్చేవారు అని ఆరోపణలు గుప్పించారు.
తాలిబన్ అనుకూల, కుల, వారసత్వ రాజకీయాలను ఉత్తరప్రదేశ్ ప్రజలు సహించబోరని యోగి ఆదిత్య నాధ్ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు, అవినీతికి ప్రతిపక్ష పార్టీలు పెట్టింది పేరని మండిపడ్డారు.
ఈ దేశాన్ని ముందు బ్రిటిష్ వాళ్లు లూటీ చేశారు. తర్వాత ఆ పని కాంగ్రెస్ పార్టీ చేసింది. రాముడిపై నెహ్రూకు నమ్మకం లేదు. సాధువులపై ఇందిరాజీ కాల్పులు జరిపించారు. శ్రీరాముడి ఉనికిని సోనియాజీ అంగీకరించరు అని ఆరోపించారు.