MSP | న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): పంట సాగు వ్యయం అనూహ్యంగా పెరిగినవేళ.. కనీస మద్దతు ధరల విషయంలో దేశ రైతాంగాన్ని మోదీ సర్కార్ మరోమారు నిరుత్సాహపర్చింది. క్వింటాల్ వరిపై రూ.143 పెంచుతూ ఎమ్మెస్పీ ధర రూ. 2183గా నిర్ణయించింది. 2023-24 ఖరీఫ్ సీజన్ (వానాకాలం)కు సంబంధించి ఎమ్మెస్పీ ధరలను కేంద్రం బుధవారం వెల్లడించింది.
నామమాత్రపు ధరలతో మమ..
ధాన్యం సాధారణ రకానికి క్వింటాలు మద్దతు ధర రూ. 2183గా, గ్రేడ్-ఏ రకం ధాన్యం మద్దతు ధరను రూ. 2203గా నిర్ణయించింది. గతేడాదితో పోల్చితే ధాన్యానికి కేవలం రూ. 143 మాత్రమే దక్కింది. మక్కజొన్నకు రూ. 2090గా నిర్ణయించింది. రూ. 128 మాత్రమే పెంచింది. కంది క్వింటాలుకు గతంలో రూ. 6600 ఉండగా రూ. 400 పెంచింది. పెసర్లకు గతంలో రూ. 7755 ఉండగా రూ. 803 పెంచించింది. వేరుశనగకు రూ. 6377గా నిర్ణయించింది. మీడియం స్టేపుల్ పత్తికి రూ. 6620గా నిర్ణయించింది. గతంలో దీని ధర రూ. 6080గా ఉండేది. ఇక లాంగ్ స్టేపుల్ పత్తికి గతేడాది రూ. 6380 ఉండగా ఇప్పుడు రూ. 7020గా నిర్ణయించింది.
రాష్ట్ర ప్రతిపాదనలు బుట్టదాఖలు…
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదిక ప్రకారం వరి గ్రేడ్ ఏ రకం క్వింటాలు మద్దతు రూ. 5100 ఉండాలని పేర్కొంది. కానీ కేంద్రం మాత్రం కేవలం రూ. 2203 మద్దతు ధరను ఖరారు చేసింది. ఇదే విధంగా పత్తికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 16,500 ప్రతిపాదించగా కేంద్రం రూ. 7020గా నిర్ణయించింది. కందులకు రూ. 11వేలు ప్రతిపాదించగా కేంద్రం రూ. 7వేలుగా నిర్ణయించింది. ప్రతి పంటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ ఖర్చులను, 50శాతం లాభాన్ని పరిగణనలోకి తీసుకొని మద్దతు ధర ప్రతిపాదించగా కేంద్రం నామమాత్రంగా ధరలను పెంచింది.