న్యూఢిల్లీ, ఆగస్టు 12: పేదల ఆహారమైన బియ్యం, నూకలపై కూడా ఎడాపెడా పన్నులేస్తూ ఉసురు పోసుకొంటున్న కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్లకు మాత్రం పన్ను రాయితీల రూపంలో లక్షల కోట్లు దోచి పెడుతున్నది. రెండేండ్లలోనే కార్పొరేట్ పన్ను తగ్గింపు ద్వారా ఏకంగా రూ.1.84 లక్షల కోట్లు కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చినట్టు పార్లమెంటరీ స్థాయీ సంఘం బయటపెట్టింది. పేదలకు సంక్షేమ పథకాలు కూడా అమలుచేయొద్దని షరతులు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం, బడా బాబులపై మాత్రం అంతులేని కరుణ చూపిస్తున్నది.
ఈ ఏడాది లక్షల కోట్లకు పైగానే..
కేంద్ర ప్రభుత్వం దేశీయ కంపెనీలకు రెండేండ్ల క్రితం పన్ను రాయితీలు ప్రకటించింది. దీనివల్ల 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.87,835 కోట్లు, రూ.2020-21లో రూ.96,400 కోట్ల కార్పొరేట్ పన్ను రాబడి తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం లక్ష కోట్లకుపైగానే ఉంటుందని పార్లమెంటరీ ప్యానల్ అంచనా వేసింది. ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 115 బీబీఏ కింద కార్పొరేట్ కంపెనీల నుంచి 2019-20లో కేంద్రానికి రూ.9.33 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్స్ ప్రకారం ఇందులో నుంచి కంపెనీలకు రూ.1.45 లక్షల కోట్లు వెళ్లాయి. సెక్షన్ 115 బీఏబీ కింద మొత్తం ఆదాయం రూ.35.13 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలు పొందిన కంపెనీలు దేశంలోని మొత్తం కంపెనీల్లో 15.85 శాతం మాత్రమే ఉండగా, రాయితీ పన్ను మొత్తంలో ఈ కంపెనీలకు ఏకంగా 62 శాతం వెళ్లటం గమనార్హం.
ఉద్యోగాల కల్పనేది?
దేశీయ కంపెనీలు విదేశీ పోటీని తట్టుకొని నిలబడేందుకు, దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే పన్ను రాయితీ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇంత భారీ మొత్తంలో రాయితీలు ఇచ్చినప్పుడు కంపెనీలు వ్యాపారాలను విస్తరించి భారీగా ఉద్యోగాలు కల్పించాలి. కానీ దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నదని అనేక నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ కుంగిపోతున్నదని ప్రభుత్వ నివేదికలే తేల్చేస్తున్నాయి. కంపెనీలు భారీగా విస్తరించి వ్యాపారాలు నిర్వహిస్తే ఆర్థిక వ్యవస్థ వెనుకపట్టు ఎందుకు పడుతున్నదని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలను ప్రసన్నం చేసుకొనేందుకే ఇంత భారీగా పన్ను రాయితీలు ఇస్తున్నది తప్ప, దానివల్ల దేశానికి పెద్దగా ఒరుగుతున్నది ఏమీ లేదని విమర్శిస్తున్నారు.