అగ్నిపథ్ను సమర్థించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు
యువత నమ్మకపోవడంతో పారిశ్రామికవేత్తలతో ప్రకటనలు!
న్యూఢిల్లీ, జూన్ 20: అగ్నిపథ్ను సమర్థించుకొనేందుకు కేంద్రం నానా తంటాలు పడుతున్నది. యువత ఆగ్రహాన్ని చల్లార్చడానికి వయోపరిమితిని పెంచి, రిజర్వేషన్లు ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం.. నిరసనలు ఎంతకీ ఆగకపోవడంతో తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులతో అగ్నివీరులకు అఫర్లు ప్రకటింపజేసింది. అయినప్పటికీ యువత బీజేపీని నమ్మకపోవడంతో.. ‘అగ్నిపథ్ మంచిదే. నాలుగేండ్ల తర్వాత మీరు సైన్యంలో కొనసాగకపోతే మా పరిశ్రమల్లో నియమించుకొంటాం’ అని కార్పొరేట్లతో చెప్పిస్తున్నది. పారిశ్రామికవేత్తలు మూకుమ్మడిగా అగ్నిపథ్కు మద్దతు పలకడం ఈ అనుమానాన్నే కలిగిస్తున్నది. అగ్నిపథ్ పథకానికి మద్దతుగా సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ చైర్మన్ చంద్ర శేఖరన్, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా, బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు ట్వీట్లు చేశారు.
అగ్నివీరుల కోసం పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ‘అగ్నిపథ్తో శిక్షణ పొందిన, క్రమ శిక్షణ కలిగిన యువత పరిశ్రమలకు లభిస్తారు’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ‘వ్యవసాయ పరికరాల తయారీ నుంచి విమానాల తయారీ సంస్థల దాకా కంపెనీలు క్రమశిక్షణ, నైపుణ్యం ఉన్న యువత కోసం చూస్తున్నాయి. అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తాయి’ అన్నారు. అగ్నిపథ్పై హింసాత్మక నిరసనలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల్లో అగ్నివీరుల కోసం చాలా ఉపాధి అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
కార్పొరేట్లు చేతులు కలపాలి
టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, హర్ష్ గోయెంకా, కిరణ్ మజుందార్ షా కూడా ఇదే తరహా ట్వీట్లు చేశారు. ‘అగ్నిపథ్ అనేది దేశానికి సేవ చేయడానికి యువతకు అందివచ్చిన గొప్ప అవకాశం మాత్రమే కాదు. టాటా గ్రూప్తో సహా అన్ని పరిశ్రమలకు క్రమశిక్షణ కలిగిన అగ్నివీరులను అందిస్తుంది’ అని చంద్రశేఖరన్ అన్నారు. అగ్నివీరుల సామర్థ్యాన్ని టాటా గ్రూప్ తప్పకుండా గుర్తిస్తుందని, వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ‘ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ కూడా అగ్నిపథ్ను స్వాగతిస్తున్నది. అవకాశం ఉన్న చోట అగ్నివీరులకు తప్పకుండా ఉపాధి కల్పిస్తాం. మిగతా కార్పొరేట్ కంపెనీలు కూడా యువత భవిష్యత్తు కోసం చేతులు కలుపుతారని ఆశిస్తున్నా’ అన్నారు. ‘ఇండస్ట్రియల్ జాబ్ మార్కెట్లో అగ్నివీరులకు ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను’ అని మజుందార్ షా అన్నారు. టీవీఎస్ మోటార్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు కూడా అగ్నిపథ్కు మద్దతిచ్చారు.
ఆర్బీఐలో డైరెక్టర్లుగా..
ఆనంద్ మహీంద్రా, చంద్రశేఖరన్, టీవీఎస్ మోటార్ చైర్పర్సన్ వేణు శ్రీనివాసన్ తదితరులను కేంద్రం ఇటీవలే ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో అనధికారిక, తాత్కాలిక డైరెక్టర్లుగా నియమించడం గమనార్హం.