దేశంలో ‘ఒమిక్రాన్’ కేసులు వెలుగుచూడటంతో మరో వేవ్ ముంచుకు రానున్నదన్న భయాలు నెలకొన్నాయి. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఐరోపా, అమెరికాలోనే ముందుగా కరోనా వేవ్లు ప్రారంభమయ్యాయి. నాలుగైదు నెలల అనంతరం వైరస్ ఉద్ధృతి దేశంలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. అయితే, వేగంగా వ్యాపిస్తున్న ‘ఒమిక్రాన్’ విషయంలో ఈ ధోరణి మరింత వేగంగా మారే ప్రమాదమున్నదని వాదనలు వినిపిస్తున్నాయి. గతవారం వెలుగుచూసిన ‘ఒమిక్రాన్’ ఇప్పటికే ఆఫ్రికా, ఐరోపా దేశాలను వణికిస్తున్నది. అమెరికాలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ తొలిసారిగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలోనైతే రోజురోజుకూ కేసుల సంఖ్య రెట్టింపవుతున్నది. గడిచిన తొమ్మిది రోజుల్లోనే ఈ వేరియంట్ 30 దేశాలకు వ్యాపించింది.
అమెరికా, బ్రిటన్, భారత్ వంటి దేశాల్లో గతంలో కరోనా సృష్టించిన ఉద్ధృతి, గణాంకాలను విశ్లేషిస్తే.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ల మధ్యనున్న సరాసరి గడువు 6 నుంచి 8 నెలలుగా ఉన్నట్టు అర్థమవుతున్నది. దీన్నిబట్టి దేశంలో సెకండ్వేవ్ తగ్గాక.. 6-8 నెలల్లో (ఫిబ్రవరి-ఏప్రిల్, 2022) మూడోవేవ్ ఉద్ధృతి రావొచ్చన్న వాదనకు బలం చేకూరుతున్నది. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కారణంగా మరణాలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయం తెలియాలంటే మరో 10-15 రోజులు వేచిచూడాల్సి ఉన్నదని బనారస్ హిందూ యూనివర్సిటీ జెనెటిక్స్ ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. ముఖానికి మాస్కు, భౌతిక దూరం వంటి నియమాలను పాటిస్తే, ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను సైతం కట్టడి చేయడం సులభమేనని సూచించారు. దీంతో మూడో వేవ్ ముప్పును తప్పించుకోవచ్చన్నారు.
వచ్చే ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో మూడో వేవ్ రావొచ్చని భారత శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్టీ) కరోనాపై ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందంలో ఒకరు, కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ గతంలో అంచనా వేశారు. అయితే మూడోవేవ్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుందని చెప్పారు. దాని ప్రభావం కూడా తక్కువేనన్నారు. మూడోవేవ్ వచ్చేనాటికి ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకోవడం, ప్రజల్లో కరోనాకు రోగనిరోధక శక్తి పెరగడమే ఇందుకు కారణమని వివరించారు.
-నేషనల్ డెస్క్