Corona virus : దేశంలో కరోనా వైరస్ (Corona virus) మరోసారి పంజా విసురుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పలుచోట్ల కొవిడ్ కొత్త వేరియంట్ (Covid new variants) లను అధికారులు గుర్తిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కొత్త వేరియంట్లు వెలుగుచూస్తుండటం కలకలం రేపుతోంది. భారత్లో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్బీ.1.8.1, ఎల్ఎఫ్.7 లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) శనివారం వెల్లడించింది.
ఎన్బీ.1.8.1 వేరియంట్ కేసు ఏప్రిల్లో వెలుగుచూడగా.. ఎల్ఎఫ్.7 కు సంబంధించి నాలుగు కేసులను ఈ నెలలో గుర్తించినట్లు కన్సార్టియం తెలిపింది. ఆ కేసులు తమిళనాడు, గుజరాత్లో నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మూడేళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కొవిడ్ విస్తృతి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి.
అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వాటి తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ఇటీవల కాలంలో ఆసియా దేశాలు మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్లాండ్తోపాటు చైనాలోనూ కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు.
జేఎన్.1 ఉపరకాలైన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు. ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యత సరిచూసుకోవాలని సూచించింది.
అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కొవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న జేఎన్.1 రకం ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటికే స్పష్టంచేసింది.