తిరువనంతపురం: కేరళలో కరోనా న్యూ వేరియంట్ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో JN.1 (జేఎన్.1) వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో దేశంలో నమోదయ్యే మొత్తం రోజువారీ కరోనా కేసుల్లో కేరళలో అత్యధికంగా ఉంటున్నాయి. కేరళలో నవంబర్ నెల మొత్తం 470 కరోనా కేసులు నమోదు కాగా.. డిసెంబర్ నెల తొలి పది రోజుల్లోనే 825 మంది కరోనా బారినపడ్డారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1104కు పెరిగింది.
కొత్త వేరియంట్ కారణంగా కేరళలో కరోనా కేసులు పెరగడం దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణం అవుతున్నది. దాంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 312 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 31 తర్వాత దేశంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో మొత్తం 17,605 మందికి పరీక్షలు నిర్వహించగా 312 మందికి పాజిటివ్గా తేలింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1296కు చేరింది.
కాగా, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య నాలుగున్నర కోట్లు దాటింది. అందులో 98 శాతం మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. మొత్తం 5,33,310 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే దేశంలో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం కరోనా టీకాల సంఖ్య 220.67 కోట్లకు చేరుకున్నది.