ఏ నెలలోనైనా తీసుకోవచ్చు
కేంద్ర ప్రభుత్వం అనుమతి
న్యూఢిల్లీ, జూలై 2: ఇక గర్భిణులు కూడా కరోనా టీకా తీసుకోవచ్చు. వారు కొవిన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు లేదా సమీపంలోని టీకా కేంద్రానికి నేరుగా వెళ్లి టీకా పొందవచ్చు. జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) సిఫారసుల మేరకు గర్భిణులు కూడా టీకా తీసుకోవడానికి అర్హులేనని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందజేసింది. ఎన్టీఏజీఐతో పాటు కరోనా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై జాతీయ స్థాయి నిపుణుల బృందం (ఎన్ఈజీవీఏసీ) కూడా గర్భిణులకు టీకా పంపిణీ చేయవచ్చని ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. గర్భిణులకు టీకా అంశంపై ఎఫ్వోజీఎస్ఐ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, సీఎస్వోలు, ఎన్జీవోలు, సాంకేతిక నిపుణులు, అభివృద్ధి భాగస్వామ్య సంస్థలతో జాతీయస్థాయిలో ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది. ఎన్టీఏజీఐ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. గర్భిణులకు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. గర్భిణులు ఏ నెలలోనైనా టీకా తీసుకోవచ్చు.
సెకండ్వేవ్ ఇంకా ముగియలేదు
దేశంలో కరోనా సెకండ్వేవ్ ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాబట్టి అజాగ్రత్త తగదని, ప్రజలు తప్పకుండా కరోనా మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. గత నెల 21 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు దాదాపు 50 లక్షల మందికి కరోనా టీకాలు వేశామని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల్లో 46,617 కొత్త కేసులు నమోదయ్యాయని వివరించింది. రోజువారీగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న కేరళ, అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్గఢ్, మణిపూర్ రాష్ర్టాలకు ప్రత్యేక బృందాలను పంపుతున్నామని, ఆయా రాష్ర్టాల్లో కరోనా పరిస్థితిని సమీక్షించి, కేసులను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ బృందాలు సలహాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
జాన్సన్ టీకాతో డెల్టా నుంచి రక్షణ
డెల్టా వేరియంట్ను జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా అడ్డుకున్నట్టు మూడో దశ ట్రయల్స్ ఫలితాల నివేదిక పేర్కొంది. ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ 85 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నదని తెలిపింది.