న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కొవిడ్ సెకండ్ వేవ్తో చిగురుటాకులా వణికిపోతున్న దేశంలో మూడుసార్లు ఉత్పరివర్తనం చెందిన వైరస్ (ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్) వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తున్నది. మూడుసార్లు ఉత్పరివర్తనానికి చెందిన బీ.1.617 రకం స్ట్రెయిన్ను నాలుగు రాష్ర్టాలు మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్లో తాజాగా గుర్తించినట్టు నిపుణులు తెలిపారు. ఈ మేరకు ఓ ఇంగ్లీష్ వార్తా పత్రిక నివేదికలో పేర్కొంది. మూడుసార్లు ఉత్పరివర్తనం చెందిన వైరస్కు బెంగాల్ హాట్స్పాట్గా మారనున్నదని, తాజా మ్యుటేషన్లతో దేశంలో మరిన్ని కేసులు పెరిగే ప్రమాదమున్నదని వెల్లడించింది. కొత్త మ్యుటెంట్ వైరస్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీలైనంత తొందరగా దాని జన్యుక్రమాలను విశ్లేషించాల్సిన అవసరమున్నదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల వైరస్ ఉద్ధృతిని కట్టడి చేయడంతో పాటు, కొత్త రకాలను కట్టడి చేసే వ్యాక్సిన్ల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. కాగా మూడుసార్లు ఉత్పరివర్తనం చెందిన స్ట్రెయిన్ శక్తిమంతమైనదని, వేగంగా విస్తరిస్తున్నదన్న వాదనలకు ఇప్పటివరకూ శాస్త్రీయ ఆధారాలు లభించలేదని, అయితే అప్రమత్తంగా ఉండటం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.