న్యూఢిల్లీ, ఆగస్టు 23: కరోనా మూడో వేవ్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎప్పుడైనా సంభవించవచ్చని కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడీఎం) ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ అంచనా వేసింది. మూడో వేవ్ వస్తే పెద్దలతో పాటే పిల్లలకు కూడా సమానంగా ముప్పు పొంచి ఉందని పేర్కొన్నది. ఈ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్పడానికి తగినంత సమాచారం లేదని వెల్లడించింది. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి ఈ కమిటీ నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా కేవలం 7.6శాతం(10.4 కోట్లు) మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొన్నారని తన నివేదికలో తెలిపింది. వ్యాక్సినేషన్ వేగం పెరగకపోతే మూడో వేవ్లో రోజుకు ఆరు లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎక్కువ మంది పిల్లలు వైరస్ బారిన పడితే సరిపడా వెంటిలేటర్లు, అంబులెన్సులు, వైద్యులు, వైద్య సదుపాయాలు లేవని పేర్కొన్నది. పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో లేని విషయాన్ని ప్రస్తావించింది. దేశంలో 80-90 శాతం మందిలో యాంటిబాడీలు సాధించే వరకు ఇలాంటి వేవ్లు వస్తూనే ఉంటాయని ఎపిడమాలజిస్టులు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది.
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న 12+ పిల్లలకు ముందుగా వ్యాక్సిన్
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న 12 ఏండ్లు పైబడిన పిల్లలను ప్రాధాన్య వర్గంగా గుర్తించి ముందుగా కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. వీరి కోసం జైడస్ క్యాడిలా సంస్థ సరఫరా చేసే ‘జైకొవ్-డీ’ వ్యాక్సిన్ను కేటాయిస్తారు. ఈ విషయాన్ని జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) చీఫ్ ఎన్కే అరోరా తెలిపారు.