అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
ప్రధాని నరేంద్రమోదీ పిలుపు
స్వామిత్వ పథకం కింద ఈ- ప్రాపర్టీ కార్డుల పంపిణీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కరోనాను గ్రామాలకు చేరకుండా అడ్డుకోవాలని, గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా చూడాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. గతేడాది కంటే ప్రస్తుతం దేశం ముందు అతిపెద్ద సవాల్ ఉన్నదన్నారు. వైరస్ నియంత్రణలో పంచాయతీల పాత్రను ప్రధాని ప్రశంసించారు. కరోనా మార్గదర్శకాలు సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని స్థానిక యంత్రాంగాన్ని కోరారు. శనివారం జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ‘స్వామిత్వ’ పథకం కింద ఈ-ప్రాపర్టీ కార్డుల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. 8 రాష్ర్టాల ముఖ్యమంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వర్చువల్ మాధ్యమంలో పాల్గొన్నారు. గతేడాది కరోనాను గ్రామాలకు చేరకుండా అడ్డుకట్టవేశామని, ఈసారి కూడా విజయం సాధించగలమని పేర్కొన్నారు. ఈసారి వైరస్ నుంచి రక్షణకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నదని, గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొనేలా చూడాలన్నారు. పేదలకు మే, జూన్ నెలలకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తున్నదని చెప్పారు. దీని ద్వారా 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని జాతీయ పంచాయతీ అవార్డులను అందజేశారు. సామాజిక-ఆర్థిక స్వయం సమృద్ధ గ్రామీణ భారతమే లక్ష్యంగా గతేడాది ఏప్రిల్లో స్వామిత్వ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.
టీకాలు, ఆక్సిజన్పై దిగుమతి సుంకం లేదే
కరోనా వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, సంబంధిత పరికరాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్ను కేంద్రం మినహాయించింది. ఇది 3 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్స్, ఫిల్లింగ్ సిస్టమ్స్, స్టోరేజ్ ట్యాంక్స్, సిలిండర్స్, క్రయోజనిక్ సిలిండర్స్ తదితర 16 రకాల ఆక్సిజన్ సంబంధిత పరికరాలపై సుంకాన్ని మాఫీ చేయనున్నట్టు పేర్కొన్నది. వెంటిలేటర్లు, నాసల్ మాస్క్లుపైనా సుంకాన్ని మినహాయించినట్టు తెలిపింది. ప్రస్తుతం వ్యాక్సిన్ల దిగుమతిపై 10 శాతం కస్టమ్స్ డ్యూటీని విధిస్తున్నారు.