న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మళ్లీ కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తున్న తరుణంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో రోజువారీ కొవిడ్ కేసులు రోజులు గడిచేకొద్దీ వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు రోజుల్లోనే క్రియాశీల కేసులు మూడు రెట్లు పెరిగాయన్నారు. అయితే, చాలా ఇన్ఫెక్షన్లు తేలికపాటివేనని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ నగరంలో యాక్టివ్ కేసులు 6,360 ఉన్నాయని, మూడు రోజుల కిందట 2,291 ఉన్నాయన్నారు. మూడు రోజుల్లోనే యాక్టివ్ కేసులు మూడు రెట్లు పెరిగాయన్నారు. డిసెంబర్ 29న 923 కేసులు, 30న 1,313 కేసులు, 31న 1,796 కేసులు, జనవరి 1న 2,716 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు. ఇవాళ 3వేలకుపైగానే కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు.
దాదాపు అన్ని కేసుల్లో తేలికపాటి లక్షణాలు ఉంటున్నాయని, కొందరిలో లక్షణాలు కనిపించడం లేదని ఢిల్లీ సీఎం పేర్కొన్నారు. శనివారం ఆసుపత్రుల్లో 246 బెడ్లు నిండాయని, అలాగే 82 ఆక్సిజన్ బెడ్లపై చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆక్సిజన్ అవసరం ఉన్న బాధితులెవరూ దవాఖానాలకు రావడం లేదని, 37వేల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, తరుచూ చేతులను సబ్బుతో శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.