UP Polls : సమాజ్వాదీ అభ్యర్థి రూపాలీ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ విషయంలో సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ను కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఒప్పించానని, టిక్కెట్ తెచ్చుకున్నానని, ఫతేబాద్ నుంచి బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు. అయితే తనకు టిక్కెట్ ఎందుకు కావాలో ఓ వీడియోను కూడా అఖిలేశ్కు చూపించానని ఆమె వెల్లడించారు. ఆ వీడియోలో తన తండ్రి (ఓ హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న)ని అవమానించేలా ప్రత్యర్థులు మాట్లాడారని, అలాగే ఠాకూర్ వర్గాన్ని కించపరిచేలా తమ ప్రత్యర్థులు మాట్లాడారని, వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికే తనకు టిక్కెట్ కావాలని అఖిలేశ్ను అభ్యర్థించానని ఆమె వెల్లడించారు.
అయితే తనకు కుల వ్యవస్థపై తనకు నమ్మకం లేదని, కేవలం పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువ కావాలన్నదే తన అభిమతమని రూపాలీ దీక్షిత్ స్పష్టం చేశారు. ‘సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్తో నేను భేటీ అయ్యాను. ఏం కావాలని అడిగారు. బీజేపీ అభ్యర్థి ఛోటేలాల్ వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నానని తెలిపాను. ఫతేబాద్ నుంచి టిక్కెట్ కావాలని అడిగాను. కచ్చితంగా గెలిచే వస్తాను అని కూడా హామీ ఇచ్చాను’ అని రూపాలీ పేర్కొన్నారు.
రూపాలీ చెబుతున్న కచ్చితత్వంపై నమ్మకం పెట్టుకున్న అఖిలేశ్ వెంటనే ఓకే చెప్పారు. అయితే ఫతేబాద్ నుంచి ముందుగా అనుకున్న అభ్యర్థిని పక్కన పెట్టి, రూపాలీకి టిక్కెట్ ఇచ్చారు. రూపాలీ న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు.బ్రిటన్ యూనివర్శిటీల్లో రెండు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను కూడా సంపాదించారు.