న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక గీతాప్రెస్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని జ్యూరీ 2021కి గాను గాంధీ శాంతి బహుమతి ప్రకటించడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. గీతాప్రెస్కు శాంతి బహుమతి ఇవ్వడమంటే హిందూత్వవాది సావర్కర్కు, గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేకు ఇవ్వడమేనంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కాంగ్రెస్పై ఇంకా మావోయిస్టు ప్రభావం ఉందని బీజేపీ విమర్శించింది. రామమందిర నిర్మాణానికి అడ్డంకులు సృష్టించిన వారి నుంచి, ట్రిపుల్ తలాక్పై నిషేధాన్ని వ్యతిరేకించిన వారి నుంచి ఇంతకుమించి ఏం ఆశిస్తామని పేర్కొన్నది. గీతా ప్రెస్కు అవార్డును ప్రకటిస్తే విమర్శించడం కంటే సిగ్గుచేటు ఇంకేముంటుందని మండిపడింది. మహాత్మాగాంధీకి, గీతా ప్రెస్కు మధ్య విభేదాలు ఉన్నాయంటూ గీతా ప్రెస్పై 2015లో పాత్రికేయుడు అక్షయముకుల్ రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ గుర్తు చేశారు. అలాంటి ప్రెస్కు గాంధీ శాంతి పురస్కారం ఏమిటని నిలదీశారు. ముస్లింలీగ్ను సెక్యులర్ సంస్థగా పరిగణించే కాంగ్రెస్కు తప్ప గీతా ప్రెస్కు అవార్డు విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ విమర్శించారు.
1923లో ప్రారంభం
జయదయాళ్ గోయంకా, ఘన్శ్యామ్దాస్ జలన్ కలిసి 1923లో గోరఖ్పూర్లో గీతా ప్రెస్ను స్థాపించారు. ఇప్పటి వరకు 14 భాషల్లో 41.7 కోట్ల పుస్తకాలను ఇది ప్రచురించింది. ఇందులో 16.21 కోట్ల భగవద్గీత పుస్తకాలున్నాయి. పురస్కారంతో పాటు కేంద్రం అందించనున్న రూ. కోటి నగదు బహుమతిని స్వీకరించేందుకు గీతా ప్రెస్ తిరస్కరించింది. ఈ మొత్తాన్ని మరో కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని సూచించింది.