NCERT | న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ- NCERT ) చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదమౌతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను, వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. పలు తరగతులకు చెందిన పుస్తకాల్లో గత ఏడాది ఎన్సీఈఆర్టీ ప్రకటించిన ‘సిలబస్ రేషనలైజేషన్’ బుక్లెట్లో లేని పలు అంశాలను కూడా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో మత పరిస్థితులపై గాంధీజీ మృతి ప్రభావం, హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీ చేసిన కృషి, అది హిందూ అతివాదులకు నచ్చకపోవడం, గాంధీజీ హత్యకు గురైన సందర్భంలో ఆరెస్సెస్పై కొంతకాలం పాటు విధించిన నిషేధం వంటి అంశాలను 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి మాయం అయ్యాయి.
మొఘల్ సామ్రాజ్యం చాప్టర్లను ఎన్సీఈఆర్టీ తొలగించింది. 12 తరగతి చరిత్ర పుస్తకంలో థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్-2లో ‘కింగ్ అండ్ క్రానికల్స్ : ది మొఘల్ కోర్ట్స్ చాప్టర్లను ఉపసంహరించారు. 11వ తరగతి సోషియాలజీ పుస్తకంలో ‘అండర్స్టాండింగ్ సొసైటీ’లో..మతం, వర్గం, జాతులు ప్రజలను ఏవిధంగా విడదీస్తాయి? అనేదానికి గుజరాత్ అల్లర్లను ఉదాహరణగా చూపిన పెరాగ్రాఫ్ను డిలీట్ చేశారు. ఎమర్జెన్సీ, ప్రచ్ఛన్న యుద్ధం, నక్సలైట్ ఉద్యమం తొలగించారు. 2002 మత హింసకు సంబంధించిన అంశాలను డ్రాప్ చేశారు.
పాఠ్యాంశాల తొలగింపుపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. కేంద్రం చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని, చరిత్రను మార్చాలనుకొనేవారు, ఆ చరిత్రలోనే కలిసిపోతారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రధాని మోదీ చెప్పుకొనే ‘ఆధునిక భారతం’ 2014 నుంచి ప్రారంభం అయిందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. చరిత్రను మార్చే ప్రయత్నాలు తీవ్రమయ్యాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు.
ఈ ఏడాది ఎలాంటి మార్పులు జరుగలేదని, గత ఏడాది జూన్లో సిలబస్ హేతుబద్దీకరించినట్టు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సోలంకి పేర్కొన్నారు. కంటెంట్ ఎక్కువగా ఉండటంతో పాఠ్యాంశాల్ని తొలగించామన్నారు. ప్రకటించని అంశాల మిస్సింగ్పై స్పందించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.