Rafale Deal |న్యూఢిల్లీ, డిసెంబర్ 15: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ వివాదం రేగుతున్నది. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దీనిపై ఫ్రాన్స్ న్యాయమూర్తులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణకు సహకరించేందుకు మోదీ సర్కారు తిరస్కరిస్తున్నదని ఫ్రాన్స్కు చెందిన పరిశోధనాత్మక వెబ్సైట్ మీడియా పార్ట్ సంచలన కథనం ప్రచురించింది.
భారత్కు ఫ్రాన్స్ మాజీ రాయబారి అయిన ఎమ్మాన్యుయేల్ లెనైన్ రాసిన దౌత్యపరమైన నోట్ను ఈ సందర్భంగా ప్రస్తావించింది. క్రిమినల్ కేసుల్లో భారత్ సహకారంలో ఎదురవుతున్న సవాళ్లను ఆయన అందులో ప్రస్తావించారు. భారత్ నుంచి అంసపూర్తి స్పందనలు, వివరాలు అందించడంలో జాప్యంపై ఫ్రెంచ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారని మీడియా పార్ట్ తన తాజా కథనంలో పేర్కొన్నది. ‘చాలా కేసులను మన భారత భాగస్వామ్యులు చాలా జాప్యం చేస్తారు. అదేవిధంగా ఆ వివరాలు కూడా చాలా అసంపూర్తిగా ఉంటాయి’ అని లెనైన్ తన నోట్లో పేర్కొన్నారని తెలిపింది.
రాఫెల్ డీల్లో చోటుచేసుకున్న అవినీతి, పక్షపాతం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై దర్యాప్తునకు సహకరించాలని ఫ్రాన్స్ జడ్జీలు 2022 నవంబర్లో అంతర్జాతీయ సహకారం కోసం అభ్యర్థించారని, అయితే దీనికి మోదీ సర్కారు తిరస్కరించిందని మీడియా పార్ట్ పేర్కొన్నది. దసాల్ట్, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపు జాయింట్ వెంచర్ అచిన దసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్(డీఆర్ఏఎల్), ఇతర కీలక కార్యాలయాల్లో సోదాలు చేపట్టాలని, ఒప్పందానికి సంబంధించిన జ్యుడీషియల్ పత్రాలు అందించాలని జడ్జీలు కోరారని, అయితే ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైందని పేర్కొన్నది.
ప్రధాని మోదీ పారిస్లో రాఫెల్ డీల్ను ప్రకటించే దానికి కేవలం 12 రోజుల ముందు అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ వెంచర్ను ప్రాంభించారని, ప్రభుత్వ రంగ హెచ్ఏఎల్ ప్రయోజనాలను ఫణంగా పెట్టి మోదీ సర్కార్ అంబానీకి వేలాది కోట్ల రూపాయల ఒప్పందాన్ని కట్టబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టా వెస్ట్ల్యాండ్ చాపర్ స్కామ్లో ఈడీ అరెస్టు చేసిన వ్యాపారవేత్త సుశేన్ గుప్తా.. రాఫెల్ డీల్లో కూడా ఏజెంట్గా ఉన్నారని, ఆయనకు పెద్దయెత్తున కమీషన్ అందిందని మీడియా పార్ట్ గతంలో ప్రచురించిన ఓ కథనంలో పేర్కొన్నది.