Bihar | పాట్నా : ఓ ఎస్సైని ఇసుక మాఫియా ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తే అదేమీ కొత్త విషయం కాదంటూ బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటివి మామూలేనని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ జరిగాయని ఉదహరించారు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.
జాముయ్ జిల్లాలోని మహులియా తాండ్ గ్రామంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ను అడ్డుకునేందుకు గర్హి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ప్రభాత్ రంజన్ ప్రయత్నించారు. ఏమాత్రం ఖాతరు చేయని ట్రాక్టర్ డ్రైవర్ ఆయనను ఢీకొట్టాడు. కిందపడిన ప్రభాత్ పైనుంచి ట్రాక్టర్ను పోనిచ్చాడు. తీవ్రంగా గాయపడిన ప్రభాత్ను దవాఖను తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.