ముంబై, నవంబర్ 20: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) సర్కారుపై కాంట్రాక్టర్లు కన్నెర్ర చేశారు. పెండింగ్ బిల్లులపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు పోరుబాట పట్టారు. ఈ నెల 26లోగా బిల్లులు చెల్లించకపోతే ఆ మరుసటి రోజు నుంచి పెండింగ్ పనులన్నీ నిలిపివేసి సమ్మెకు దిగుతామని షిండే సర్కారుకు అల్టిమేటం జారీచేశారు.
రాష్ట్ర సర్కారు రెండు లక్షలకుపైగా కాంట్రాక్టర్లకు రూ.10 వేల కోట్ల బిల్లులు బకాయి పడింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని దీపావళికి ముందు మూడుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు మిలింద్ భోసలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే 27 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇదే జరిగితే గ్రామీణాభివృద్ధి, జల వనరులు, జల సంరక్షణ పనుల మీద ప్రభావం పడుతుంది.
అభివృద్ధి పనుల చెల్లింపుల కోసం బడ్జెట్లో 50-65 శాతం నిధులు కేటాయించాలని కాంట్రాక్టర్స్, ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. టెండర్ల ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధుల జోక్యాన్ని నివారించాలని, కొందరు నిర్దిష్టమైన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించడాన్ని వెంటనే ఆపేయాలని కోరింది. రూ.15 లక్షలలోపు అభివృద్ధి పనులను నిరుద్యోగులైన సివిల్ ఇంజినీర్లు, చిన్న కాంట్రాక్టర్లకు లాటరీ పద్ధతిలో కేటాయించాలని డిమాండ్ చేసింది.