BJP | అహ్మదాబాద్, మార్చి 16: బీజేపీపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో కమీషన్ల వ్యవస్థ ఉన్నదని బాంబు పేల్చారు. కాంట్రాక్టర్లు చేసే ప్రభుత్వ పనుల విలువలో 2 శాతం కమీషన్లు ఇవ్వాలని బాహాటంగానే పేర్కొన్నారు. గుజరాత్లోని జలాల్పూర్ బీజేపీ ఎమ్మెల్యే రమేశ్భాయ్ చొటుభాయ్ పటేల్ ఇటీవల అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంట్రాక్టరుకు ఆయన సలహా రూపంలో ఒక హెచ్చరిక చేశారు. ‘చెరువు సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఈ డబ్బుల్లో బీజేపీ వ్యవస్థలో ఉన్న 2 శాతానికి మినహా ఎవరికీ అదనంగా ఇవ్వొద్దని’ బహిరంగంగా ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై గుజరాత్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో బీజేపీ నేతలు రహస్యంగా అవినీతికి పాల్పడే వారని, ఇప్పుడు మాత్రం బహిరంగంగానే ఒప్పుకుంటున్నారని కాంగ్రెస్ నేత హిరెన్ బంకర్ విమర్శించారు.