బెంగళూరు, ఏప్రిల్ 13: కాకులను కొట్టి గద్దలకు పంచి పెట్టినట్టు అయింది కర్ణాటకలోని ప్రభుత్వ కాంట్రాక్టర్ల పరిస్థితి. కాంట్రాక్టుల మంజూరు, చెల్లింపులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లంచం అడుగుతున్నారని బీజేపీకి ఓటేస్తే.. బీజేపీ ఎమ్మెల్యేలు అంతకు మించిన బకాసురుల్లా తయారయ్యారు. ప్రాజెక్టు ఖర్చులో ఏకంగా 40% లంచం డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఒక నియోజకవర్గంలో ఓ కాంట్రాక్టరు 10 కోట్ల రూపాయల కాంట్రాక్టును దక్కించుకోవాలంటే అందులో 4 కోట్ల రూపాయలను స్థానిక ఎమ్మెల్యేకే లంచంగా ఇవ్వాలన్న మాట. కర్ణాటకలో బీజేపీ అవినీతి పరాకాష్ఠకు ఇది నిదర్శనం. ‘బీజేపీ గెలిస్తే ఏదో మార్పు వస్తుందని భావించి అందరం ఆ పార్టీకి మద్దతిచ్చాం. గంపగుత్తగా ఓట్లేశాం. కానీ వాళ్లే రాబందుల్లా తయారయ్యారు’ అని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న ఆరోపించారు.
ఈ సంఘంలో లక్ష మందికి పైగా కాంట్రాక్టర్లు సభ్యులుగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న కమీషన్ 45 శాతాన్ని మించిపోతున్నదని కెంపన్న చెప్పారు. లంచాలు మేయడంలో బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ కాంట్రాక్టర్లను కూడా వదలడం లేదు. తాను పూర్తి చేసిన పనులకు పేమెంట్ చేయడానికి మంత్రి ఈశ్వరప్ప లంచం అడుగుతున్నారని హిందూ వాహిని నేత సంతోష్ పాటిల్ ఇటీవలే ఆరోపించారు. కొద్ది రోజుల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సీఎం బొమ్మైకి కాంట్రాక్టర్ల లేఖ
కర్ణాటకలో స్థానిక ప్రజా ప్రతినిధులకు కాంట్రాక్టరు 2% లంచం ఇవ్వడం దశాబ్దాలుగా జరుగుతున్నది. 2017-18 సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 10% దాకా డిమాండ్ చేశారు. దీంతో రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్ బీజేపీకి మద్దతిచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల లంచాల దాహంపై అసోసియేషన్ ప్రధాని మోదీకి, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్కు కూడా లేఖ రాసింది. స్పందన లేదు. దీనిపై ఇటీవలే, సీఎం బొమ్మైకి కూడా లేఖ రాశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు.
కాంట్రాక్టర్, బీజేపీ నేత సంతోష్ పాటిల్ ఆత్మహత్య ఘటనలో కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరిపై కేసు నమోదైంది. ఈశ్వరప్పను మొదటి నిందితుడిగా చేర్చినట్టు పోలీసులు బుధవారం తెలిపారు. ఓ కాంట్రాక్టు డబ్బులు విడుదల చేయించేందుకు మంత్రి 45 శాతం కమీషన్ డిమాండ్ చేశారని, తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడేలా వేధించారని ప్రశాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈశ్వరప్పను అరెస్టు చేసి, తమ సోదరుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు సోదరుడి మృతదేహాన్ని తీసుకోబోమని స్పష్టంచేశారు.
అరెస్టు చేయాల్సిందే: ఈశ్వరప్పను అరెస్టు చేయాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. సంతోష్ పాటిల్ మృతిపై ప్రధాని మోదీ, సీఎం బొమ్మై, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మౌనంగా ఉండటాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. అయితే తాను రాజీనామా చేసేది లేదని ఈశ్వరప్ప పేర్కొన్నారు. వాట్సాప్ మెసేజ్ను డెత్నోట్గా ఎలా పరిగణిస్తారని అన్నారు.