Contonments| న్యూఢిల్లీ: బ్రిటీష్కాలం నుంచి వస్తున్న కంటోన్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలుకనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 58 కంటోన్మెంట్లకు పేర్లను మార్చనుంది. అలాగే వీటిని ఆయా రాష్ట్రాల మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు యోచిస్తున్నది. ఈ మేరకు రక్షణ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘కంటోన్మెంట్, రాష్ట్ర మున్సిపాలిటీల చట్టాల్లో ఏకరూపత తెచ్చేందుకు కంటోన్మెంట్ సివిల్ ఏరియాలను సమీప రాష్ట్ర మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని భావిస్తున్నాం’ అని కేంద్రం తెలిపింది.
కంటోన్మెంట్ల విలీన ప్రతిపాదనపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరినట్టు కేంద్ర సహాయ మంత్రి అజయ్భట్ తెలిపారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపడి ఉన్నందున ఎప్పటి నుంచి దీనిని అమలు చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్తోపాటు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 58 కంటోన్మెంట్లను ఆయా రాష్ట్ర మున్సిపాలిటీల్లో విలీనం చేయనున్నారు.