లండన్ : పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం సహా శుద్ధి చేసిన ఆహారానికి దూరంగా ఉన్నవారిలో కొవిడ్-19 వైరస్ తీవ్రత 40 శాతం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించకముందు నుంచి దాదాపు తొమ్మిది నెలల వరకూ ఆరు లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశీలించిన మీదట కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.
ఈ సర్వేలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకున్నవారు కరోనా తీవ్రతతో ఆస్పత్రిపాలవడం 40 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. అసలు వైరస్ సోకడం కూడా వీరిలో పది శాతం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజుకు రెండు రకాల పండ్ల ముక్కలు, మూడు రకాల కూరగాయలను తినేవారిని ఆరోగ్యకర ఆహారం తీసుకునేవారిగా పరిశోధకులు పేర్కొన్నారు. వీరు ప్రతివారం 200 గ్రాముల సాల్మన్ చేపలు వంటి ఆహారం తీసుకుంటున్నారని, వీరు కొవ్వు, చక్కరతో కూడిన ప్రాసెస్డ్ ఆహారాల జోలికి వెళ్లడం లేదని గుర్తించారు.
ఇక ఆరోగ్యకర ఆహారానికి భిన్నంగా మరికొందరు వారంలో కేవలం రెండు పండ్ల ముక్కలను తీసుకోవడం కొన్ని రోజులు కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోకుండా ఉన్నారని నిపుణులు సూచించిన పరిమాణం కంటే అధిక మోతాదులో కొవ్వు, చక్కెరలతో కూడిన శుద్ధి చేసిన ఆహారం అధికంగా తీసుకుంటారని గుర్తించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారి ప్రేవుల్లో మైక్రోబ్స్ ఆరోగ్యకరంగా పోగుపడతాయని ఇవి మెరుగైన ఆరోగ్యానికి దారితీస్తాయని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం కొవిడ్ తీవ్రత ముప్పను నిలువరిస్తుందని తొలిసారిగా తాము గుర్తించామని అధ్యయన సహ రచయిత డాక్టర్ సారా బెర్రీ వెల్లడించారు.