(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావస్తున్నది. పనుల పురోగతిపై ప్రధాని మోదీ, లోక్సభ, రాజ్యసభల కార్యదర్శులు, ఇతర అధికారుల బృందం ఇటీవల సమీక్ష నిర్వహించింది. ఈ ఏడాది నవంబర్ మధ్యలో ప్రారంభయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించే యో చనలో కేంద్రం ఉన్నది. ఇప్పటికే ప్రస్తుత పార్లమెంట్ భవనంలో సామగ్రి ప్యాకింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. అయితే కొత్త పార్లమెంట్ భవనం వచ్చే ఏడాది బడ్జెట్ సెషన్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అక్టోబర్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు దాదాపు 2,500 మంది కార్మికులు శ్రమిస్తున్నారు. స్పీకర్ పోడియం, కొత్తగా డిజైన్ చేసిన పార్లమెంట్ సభ్యుల చైర్లు మహారాష్ట్ర నుంచి సెప్టెంబర్లో రానున్నాయి. స్టాండ్ లేని మైక్ వ్యవస్థతో పాటు అత్యాధునిక ఆడియో సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. గోడలపై పెయింటింగ్స్ కోసం లోక్సభ సెక్రటేరియట్ కేంద్ర సాంస్కృతిక శాఖ సాయం కోరింది. కొత్త పార్లమెంట్ భవనం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటుందని అధికారి ఒకరు పేర్కొన్నారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీల సీటింగ్ ఇరుకుగా, గజిబిజిగా ఉన్నది. ఉభయసభల సభ్యులు ఒకేసారి కూర్చునే సమావేశాలకు అనుగుణంగా డిజైన్ లేదు. సెంట్రల్ హాల్ కెపాసిటీ 440 మందికి మాత్రమే. ఒకవేళ జాయింట్ సెషన్ నిర్వహిస్తే సీట్ల సమస్య ఎదురౌతుంది. ప్రస్తుతం 545గా ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్య 1971 సెన్సెస్ ప్రకారం ఉన్నది. 2026లో పునర్విభజన తర్వాత సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. అప్పుడు మరింత ఇరుకవుతుంది. నీటి సరఫరా, మురుగు నీరు లైన్లు, ఏసీ, ఫైర్ ఫైటింగ్, సీసీటీవీ సర్వీసులకు సంబంధించి ప్లానింగ్ లేకపోవడం వలన తర్వాత వాటిని ఏర్పాటు చేసే సమయంలో భవన సౌందర్యం పాడవుతుంది. నిర్మాణం డిజైన్లో సరిపడా వర్క్స్పేస్ కూడా లేదు. వర్క్స్పేస్కు డిమాండ్ పెరుగుతున్న సమయంలో భవిష్యత్తులో పెంచాల్సి వస్తే ప్రస్తుతం ఉన్న ఆఫీసులు మరింత ఇరుకవుతాయి.