తిరువనంతపురం: రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని పూర్తి సమాఖ్య రూపంగా మార్చాలని అన్నారు. కేరళలో సీపీఐ సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీజేపీని ఎదుర్కోవటానికి కొన్ని రాష్ర్టాలు కలిస్తే సరిపోదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు కలిసి రావాలని ఆకాంక్షించారు. కేంద్రం రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు. దీన్నుంచి బయటపడాలంటే లక్ష్యం చేరే వరకు ఐకమత్యంగా కేంద్రంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ర్టాల ఉమ్మడి పరిధిలో ఉన్న అంశాలన్నీ కేంద్రం జాబితాలోకి వెళ్లిపోతున్నాయని గుర్తుచేశారు. ఇప్పటికే ఆర్థిక హక్కులను జీఎస్టీ రూపంలో కేంద్రం దోచేసిందని, నీట్ ద్వారా విద్యాహక్కును కూడా లాగేసిందని విమర్శించారు. విద్యను కాషాయీకరణ చేసేందుకు, రాష్ర్టాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు రూపొందించిన జాతీయ విద్యావిధానం-2020ను వ్యతిరేకించాలన్నారు.