ముంబై, ఫిబ్రవరి 21: తన చిన్నాన్న, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం నేత రామ్మోహన్ నాయుడుతో వెంటనే రాజీనామా చేయించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత, ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాద ఘటనలో విమానయాన సంస్థను కాపాడేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని, ఆ సంస్థ యజమానికి, మంత్రికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధమే దీనికి కారణమని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
విమానయాన సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్ యాజమాన్యంతో మంత్రికి సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించిన ఆయన రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండగా, ఆ ప్రమాదంపై నిష్పాక్షిక విచారణ అసాధ్యమని అన్నారు. డీజీసీఏ విచారణను ఒక బూటకంగా ఆయన పేర్కొన్నారు. విమానంలో ఉద్దేశపూర్వకంగానే అత్యధికంగా ఇంధనాన్ని నింపారని, అలా చేస్తే అది ఒక ఎగిరే బాంబులా మారుతుందని చెప్పారు. ఈ ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర కోణం కూడా ఉందని తెలిపారు. ఉన్నత స్థాయి నియంత్రణ కమిటీతో దర్యాప్తు చేయించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.