న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోతే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గే ఆలోచన చేయాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) సూచించారు. ఆదివారం పీటీఐతో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆచరణాత్మక ప్రయోజనాల కోసం పార్టీని నడుపుతున్నారని తెలిపారు. అయితే గత పదేళ్లలో కాంగ్రెస్కు విజయం అందించలేకపోయినప్పటికీ పక్కకు తప్పుకోవడం లేదా పార్టీ బాధ్యతలను పూర్తిగా మరొకరికి అప్పగించలేదని విమర్శించారు.
కాగా, తన అభిప్రాయం ప్రకారం ఇది కూడా ప్రజాస్వామ్య విరుద్ధమని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ‘మీరు గత 10 సంవత్సరాలుగా విజయం సాధించకుండా అదే పని చేస్తున్నప్పుడు, విరామం తీసుకోవడం వల్ల నష్టమేమీ లేదు. ఐదేళ్ల పాటు మరొకరిని మీరు అనుమతించాలి. ఈ పని మీ అమ్మ చేసింది’ అని అన్నారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం రాజకీయాలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. దీంతో 1991లో పీవీ నరసింహారావు ప్రధాని బాధ్యతలు చేపట్టారని అన్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి నాయకుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారిలో ఏం లోపం ఉందో అన్నది వారికి తెలుసని, ఆ లోటును భర్తీ చేయడానికి వారు చురుకుగా వ్యవహరిస్తారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ‘కానీ తనకు అన్నీ తెలుసని రాహుల్ గాంధీకి అనిపిస్తుంది. సహాయ అవసరాన్ని మీరు గుర్తించకపోతే ఎవరూ మీకు సహాయం చేయలేరు. తాను అనుకున్నది అమలు చేయగల వ్యక్తి తనకు అవసరమని ఆయన నమ్ముతాడు. అయితే అది సాధ్యం కాదు’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ పతనం అంచునకు చేరిందన్న వాదనను ప్రశాంత్ కిషోర్ ఖండించారు. కాంగ్రెస్ను కేవలం పార్టీగా చూడకూడదని అన్నారు. ‘దేశంలో దాని ప్రాతినిధ్యాన్ని ఎప్పటికీ ముగించలేం. అది సాధ్యం కాదు. కాంగ్రెస్ తన చరిత్రలో అనేకసార్లు అభివృద్ధి చెందింది, పునర్జన్మ పొందింది’ అని అన్నారు. అయితే
ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన పనితీరులో, నిర్మాణాత్మక లోపాలతో బాధపడుతోందని తెలిపారు. వాటిని పరిష్కరించడం ఆ పార్టీ విజయానికి చాలా అవసరమని స్పష్టం చేశారు.