బెంగళూర్ : కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తోంది. మంత్రి ఈశ్వరప్ప రాజీనామాకు డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి బసవ్రాజ్ బొమ్మై నివాసానికి ప్రదర్శనగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు అవినీతి ఆరోపణలపై కర్నాటక మంత్రి కే ఈశ్వరప్పపై వేటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన సెగలు ఢిల్లీని తాకాయి. సంతోష్ పాటిల్ బలవన్మరణానికి బాధ్యుడైన ఈశ్వరప్పను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి.
ఇక ఓ కాంట్రాక్టు వ్యవహారంలో మంత్రి ఈశ్వరప్ప తనను 30 శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడని బీజేపీ కార్యకర్త కూడా అయిన సంతోష్ పాటిల్ సూసైడ్ నోట్లో పేర్కొనడం కలకలం రేపింది. కాగా తనకు కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఎవరో తెలియదని మంత్రి ఈశ్వరప్ప తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు.