చండీగఢ్; పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం నుంచే ఆయన తిరిగి పోటీ చేస్తున్నారు. నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని దండతంత్రగా మార్చడం ఇష్టం లేదన్నారు. ఈ నగరం కాంగ్రెస్పై విశ్వాసం కలిగి ఉందని, అది కొనసాగుతుందన్నారు. మీకు (బిక్రమ్ సింగ్ మజితియా) ధైర్యం ఉంటే మజితాను విడిచిపెట్టి అమృత్సర్ తూర్పు నుంచి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
మరోవైపు, పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజితియాను అమృత్సర్ ఈస్ట్ నుంచి సిద్ధూపై పోటీకి శిరోమణి అకాలీదళ్ దింపింది. ఆయన మజితా నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధూ ఈ మేరకు విమర్శించారు. కాగా, ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.