న్యూఢిల్లీ : సాయుధ బలగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రిక్రూట్మెంట్ స్కీంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్నిపథ్ సత్యాగ్రహ దీక్షను చేపట్టనుంది. అగ్నిపధ్ స్కీంను తక్షణమే వెనక్కితీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు శనివారం రాత్రికి ఢిల్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్రస్ధాయి నేతలను అగ్రనాయకత్వం కోరిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తరహాలోనే అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. గత ఏడాది మూడు సాగు చట్టాలను ఉపసంహరించే సమయంలో రైతులకు క్షమాపణ చెప్పిన విధంగానే దేశ యువతకు మోదీ మరోసారి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు.
ఎనిమిదేండ్లుగా మోదీ ప్రభుత్వం జై జవాన్..జై కిసాన్ విలువలను అవమానిస్తోందని దుయ్యబట్టారు. ఇక నిరుద్యోగ యువత బాధలు, వారిలో నెలకొన్న నైరాశ్యాన్ని ప్రభుత్వం అర్ధం చేసుకోవడం లేదని, తక్షణం అగ్నిపథ్ స్కీంను వెనక్కితీసుకోవాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాధ్రా డిమాండ్ చేశారు.