కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజస్థాన్ వ్యవహారాల గురించి చర్చించారు. సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత సచిన్ పైలట్ విలేకరులతో మాట్లాడారు. అందరూ కలిసి కట్టుగా వుంటూ.. తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తేవాలని సోనియా సూచించినట్లు పైలట్ వెల్లడించారు.
రాజస్థాన్ సంస్థాగత వ్యవహారాలు, పార్టీ పటిష్ఠతపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయం రాజస్థాన్లో వుందని, అయితే తాము కష్టపడి, సరైన మార్గదర్శనంలో వెళితే, తిరిగి కాంగ్రెస్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే.. తన భవిష్యత్ ఎలా వుంటుందన్న చర్చ కూడా పైలట్ సోనియాతో చేసినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవులు నిర్వహించారు. అయితే సీఎం గెహ్లోత్తో విభేదాల కారణంగా అధిష్ఠానం ఆయన్ను ఆ పదవుల నుంచి తొలగించింది. అయితే.. తనకు ముఖ్యమంత్రి పదవి చేయాలన్న కోరిక ఉందన్న విషయాన్ని పైలట్ అధినేత్రి సోనియా ముందు ఉంచినట్లు తెలుస్తోంది.