న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, పార్టీ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్కు చెందిన ఆఫీస్ బేరర్ల నోటికి తాళం వేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్.. పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న శశిథరూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఇతర నేతలు ఎవరూ ఆవిధంగా నోరు పారేసుకోకుండా చెక్ పెట్టింది.
ఆ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ, కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జైరామ్ రమేశ్.. పార్టీ క్యాడర్ను ఉద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ పడబోతున్న సహచర నేతలపై పార్టీ అధికార ప్రతినిధులుగానీ, కమ్యూనికేషన్ డిపార్టుమెంట్కు చెందిన ఆఫీస్ బేరర్లుగానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తన సందేశంలో పేర్కొన్నారు.
మనందరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉంటాయని, కానీ పార్టీ అధ్యక్ష ఎన్నికలను ప్రజాస్వామ్యబద్దంగా, పారదర్శకంగా నిర్వహించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని చాటిచెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని జైరామ్ రమేశ్ తన సందేశంలో స్పష్టంచేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి.