న్యూఢిల్లీ : భవానీపూర్ ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని బరిలో దింపకపోవచ్చని భావిస్తున్నారు. బెంగాల్, ఒడిషాలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్ధానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించిన అనంతరం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేస్తారని టీఎంసీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రాం నుంచి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారితో పోటీపడిన మమతా బెనర్జీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. సీఎం పదవిలో కొనసాగాలంటే ఆమె అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉండటంతో రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉప ఎన్నికలు నిర్వహించాలని బెంగాల్ ప్రభుత్వం ఈసీని కోరింది.
మమతా బెనర్జీ అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు వీలుగా భవానీపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రి, టీఎంసీ సీనియర్ నేత సోవన్దేవ్ ఛటోపాధ్యాయ్ రాజీనామా చేశారు. ఇక బెంగాల్లోని షంషేర్గంజ్, జంగీపూర్లతో పాటు భవానీపూర్ అసెంబ్లీ స్ధానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు జరగనుండగా అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు.