న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో ‘పెగసస్’ మరోసారి మళ్లీ ప్రకంపనలు సృష్టించింది. స్పైవేర్ డీల్పై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. పెగసస్తో భారత ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం హైజాక్ చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. ఈ డీల్లో మోదీ హస్తం ఉందన్న ఆయన.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో పాటు పలువురు నేతలపై మోదీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా నిఘాపెట్టారని ఆరోపించారు. 2017లో ఇజ్రాయెల్తో జరిగిన రక్షణ ఒప్పందంలోనే పెగాసస్ భాగమైందని, 2 బిలియన్ డాలర్లకు డీల్ జరిగిందన్నారు. ఇదిలా ఉండగా.. పెగసస్ వ్యవహారంపై న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది.
ఇందులో ‘ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ పదేళ్లుగా నిఘా సాఫ్ట్వేర్లను సబ్స్ర్కిప్షన్ విధానంలో చట్టసభలు, నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. అమెరికా ఎఫ్బీఐకి సైతం విక్రయించగా.. దీన్ని వినియోగించలేదు. భారత్ కూడా దాన్ని కొనుగోలు చేసింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 2017న జూలైలో మోదీ తొలిసారిగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఓ భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం అదే తొలిసారి.
ఆ సమయంలోనే ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాల, సాంకేతిక మార్పిడి కోసం ఇజ్రాయెల్తో మోదీ 2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్లోనే పెగసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయి. ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ భారత్లో పర్యటించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 2019 జూన్లోనే ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై జరిగిన ఓటింగ్లో ఇజ్రాయెల్కు అనుకూలంగా భారత్ ఓటువేసింది’ అని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది.
ఇదిలా ఉండగా.. పెగసస్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ కేంద్రంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుర్పించారు. ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా అధికార పక్షం.. ప్రతిపక్షం, సైన్యం, న్యాయవ్యవస్థ.. అన్నింటినీ టార్గెట్ చేశారన్నారు. ఇది దేశద్రోహమేనని, మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు.