చండీగఢ్: పంజాబ్లోని మొహాలీ నుంచి ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి గురువారం భారీ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్నది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో ఈ ర్యాలీ జరుగుతుందని ఆయన కార్యాలయం బుధవారం తెలిపింది. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధుల బృందం బుధవారం ప్రత్యేక విమానంలో లక్నో చేరింది. పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్, పంజాబ్ సీఎం చరంజిత్ చన్నీ రాహుల్ వెంట ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని కొంతసేపు లక్నో ఎయిర్పోర్ట్లో నిలువరించారు.
అనంతరం కాంగ్రెస్ బృందం సీతాపూర్ చేరుకున్నది. అక్కడ అతిథి గృహంలో నిర్బంధంలో ఉన్న ప్రియాంక గాంధీని కలుసుకుని ఆమెతో కలిసి లఖింపూర్ ఖేరీకి బయలుదేరింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని ఆయన వాహనం ఆదివారం రైతులపైకి దూసుకెళ్లడంతోపాటు అనంతరం జరిగిన ఆందోళనలో మరణించిన నలుగురు రైతు కుటుంబాలను రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం పరామర్శిస్తుంది. ఈ ఘటనల్లో ఒక జర్నలిస్ట్తోపాటు మరో ముగ్గురు కలిపి మొత్తం 8 మంది మరణించారు.