రాయ్పూర్ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చత్తీస్ఘఢ్ రాజధాని రాయ్పూర్లో 85వ ప్లీనరీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ చీఫ్గా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘం వర్కింగ్ కమిటీ స్ధానంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్లీనరీ సెషన్, భారత్ జోడో యాత్రపై స్టీరింగ్ కమిటీలో విస్తృతంగా చర్చించారు.
ఫిబ్రవరి ద్వితీయార్ధంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఇక కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని స్టీరింగ్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. యువత, మహిళ, రైతులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల నుంచి రాహుల్ యాత్రకు మద్దతు పెరుగుతున్నదని తెలిపింది. ఇక జనవరి 26 నుంచి హాథ్ సే హాథ్ జోడో పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఈ ప్రచారోద్యమంలో భాగంగా గ్రామ పంచాయితీలు, పోలింగ్ బూత్లను కవర్ చేస్తూ బ్లాక్ స్ధాయి యాత్రలు చేపడతామని చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోట్, చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్, సీనియర్ నేతలు పీ చిదంబరం, ఆనంద్ శర్మ, మీరా కుమార్, అంబికా సోనీ తదితరులు హాజరయ్యారు.