న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్లో ఓటు వేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్లడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయనుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా బీజేపీ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించిందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు.
పోలింగ్ రోజున ఓటు వేసేందుకు ప్రధాని మోదీ రెండున్నర గంటలు రోడ్షో నిర్వహించారని అన్నారు. హోంమంత్రి అమిత్ షా బీజేపీ ఎంపీతో కలిసి ప్రచారం చేశారని ఆరోపించారు. మోదీ, అమిత్ షాల వ్యవహార శైలిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈసీ ఒత్తిడితో పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
తమ ఎమ్మెల్యే, గిరిజన నేత తనకు రక్షణ కల్పించాలని ఈసీని ఆశ్రయించినా స్పందించలేదని, దీంతో ఆయనపై బీజేపీ గూండాలు దాడికి తెగబడ్డాయని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారని ఈసీని ప్రధాని మోదీ అభినందించారు.