బెంగళూరు, ఫిబ్రవరి 27: కర్ణాటక రాజధాని, దేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరుపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేయనున్నది. ఇప్పటికే మోయలేని భారంగా మారిన అపార్ట్మెంట్, ఇండ్ల కిరాయితో అల్లాడిపోతున్న ప్రజలపై మళ్లీ పన్ను పోటు పొడుస్తున్నది. ఆస్తిపన్నును భారీగా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరు నగర పాలక సంస్థ(బీబీఎంపీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గైడెన్స్ విలువ ఆధారిత పన్ను వసూలను ప్రతిపాదిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒక ముసాయిదా నోటిఫికేషన్ను తాజాగా రూపొందించారు.
ఈ ప్రతిపాదన వల్ల ఇప్పటికే అధికంగా ఉన్న కిరాయిలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రాపర్టీ కనీస ధరనే గైడెన్స్ వాల్యూ అంటారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తాజాగా ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం గైడెన్స్ విలువ లేదా ఏరియాల్లో ఉంటే సర్కిల్ రేటు ఆధారంగా ఆస్తి పన్నును ప్రభుత్వం వసూలు చేయనున్నది. ఇంతకుముందు అయితే మున్సిపల్ అధికారులు జోనల్ సర్టిఫికేషన్ ఏరియాల వారీగా ఆస్తి పన్నును వసూలు చేసేవారు. కాగా, గత ఏడాది అక్టోబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం సగటున గైడెన్స్ విలువను 25-30 శాతం వరకు పెంచింది.
మధ్యతరగతి ప్రజలపై భారం
పన్ను విధానంలో ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని కోరుతూ కర్ణాటక హోం బయ్యర్స్ సంఘం(కేహెచ్బీఎఫ్) బెంగళూరు నగర పాలక సంస్థ కమిషనర్కు లేఖ రాసింది. ప్రతి ఏడాది ఆస్తి పన్నును 5 శాతం పెంచడం వల్ల ప్రాపర్టీ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నదని, ఇంటి కిరాయిలు కూడా పెరుగుతాయని, ఇది మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారంగా మారుతుందని కేహెచ్బీఎఫ్ అధ్యక్షుడు ధనుంజయ్ పేర్కొన్నారు. పన్నుల గణన సమయంలో కార్పెట్ ఏరియాను (ప్రాపర్టీలో వినియోగిస్తున్న స్థలం) పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెంపు రెట్టింపు అవుతాయని బెంగళూరు అపార్ట్మెంట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి విష్ణు గట్టుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త మార్పులు ఏంటి?
ముసాయిదా నోటిఫికేషన్లోని ప్రతిపాదనల ప్రకారం రెంటల్ ప్రాపర్టీల యజమానులు స్వీయ ఆస్తులతో పోలిస్తే రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అద్దె ఆస్తులకు గైడెన్స్ విలువలో 0.2 శాతం కొత్త పన్ను రేటుగా ఉన్నది. అదే స్వీయ ఆస్తి విషయంలో ఇది 0.1 శాతంగా ఉన్నది. ఇది నగరంలో ఇంటి కిరాయిల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025 నుంచి ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి 5 శాతం ఆస్తి పన్నును పెంచేలా కూడా ప్రతిపాదనలు చేశారు. కొత్త ప్రతిపాదనలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ఉన్నదని బీబీఎంపీ అధికారులు పేర్కొన్నారు.