రాంచీ: పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలతో పట్టుబడిన తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నమన్ బిక్సల్ కొంగరి.. భారీ మొత్తంలో డబ్బుతో బెంగాల్లోని హౌరాలో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని జార్ఖండ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి అవినాశ్ పాండే వెల్లడించారు.
నల్ల కారులో పెద్దమొత్తంలో నగదు రవాణా అవుతుందని సమాచారం అందడంతో హౌరా జిల్లాలోని రాణిహటి వద్ద జాతీయ రహదారిపై పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బెంగాల్ వైపు నుంచి వస్తున్న కారును పోలీసులు సోదా చేయగా పెద్దమొత్తం డబ్బు బయటపడింది. అవి జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్ కొంగరివిగా గుర్తించారు. కారులో ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
కాగా, జార్ఖండ్ ప్రభుత్వ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నవేళ నోట్ల కట్టలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుపబడటం సంచలనం కలిగింది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర పన్నిందని పార్టీలు ఆరోపిస్తున్నాయి.