హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సీపీఎం నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తమతో కలిసివచ్చే పార్టీలకు మద్దతు ఇస్తామని చెప్తూనే, కేరళలో ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వయనాడ్లో రాహుల్గాంధీకి మద్దతుగా బుధవారం ప్రచారం చేసిన రేవంత్ మాట్లాడుతూ గోల్డ్ స్మగ్లింగ్ కుంభకోణం నుంచి తాను, తన కుటుంబం బయటపడేందుకు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒప్పందం చేసుకున్నారని, అందుకనే ఈడీ కానీ, ఐటీ అధికారులు కానీ ఆయన వైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలను వీరభద్రం తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తున్నదని, రాష్ట్రంలోనూ బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్న తమపై ఇలాంటి ఆరోపణలు తగవని భట్టికి తేల్చిచెప్పారు. స్పందించిన మంత్రి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. రేవంత్ ఆ వ్యాఖ్యలను ఏం సందర్భంలో చేశారో అడిగి తెలుసుకుంటానని పేర్కొన్నారు.
భువనగిరిలో మద్దతివ్వండి
భువనగిరి పార్లమెంటు స్థానానికి సీపీఎం అభ్యర్థి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారని, కాబట్టి ఆ స్థానంలో కాంగ్రెస్ తమకు మద్దతివ్వాలని సీపీఎం నేతలు భట్టి వద్ద ప్రతిపాదించారు. స్పందించిన ఆయన ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి శనివారం నిర్ణయం చెప్తామని తెలిపారు. సీపీంఎం నేతలతో చర్చల అనంతరం భట్టివిక్రమార్క మాట్లాడుతూ అధిష్ఠానం సూచన మేరకే ఇండియా కూటమిలో భాగమైన సీపీఎం నేతలతో సమావేశమైనట్టు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని భావించినప్పటికీ కుదరలేదని పేర్కొన్నారు. అప్పుడు సీపీఎం అడిగిన సీట్లు ఇవ్వలేకపోయామని, భవిష్యత్తులో మాత్రం సీపీఎంకు అన్ని రకాలుగా సహకారం ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వామపక్షాలు తెలంగాణలోనూ కాంగ్రెస్కు మద్దతునిస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
భువనగిరి తప్ప మిగతా స్థానాల్లో మద్దతు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి మినహా అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. భువనగిరిలో సీపీఎం అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు కోరినట్టు చెప్పారు. భువనగిరిలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వకున్నా స్నేహపూర్వక పోటీ చేయాలని ఇరుపార్టీలు నిర్ణయించినట్టు చెప్పారు. భువనగిరి స్థానంలో సీపీఎం అభ్యర్థికి మద్దతు విషయంలో సీపీఐ కూడా కాంగ్రెస్తో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించినట్టు తెలిపారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు, బీజేపీని ఓడించేందుకు తమతో కలిసి వచ్చే వారికి మద్దతివ్వాలనేదే సీపీఎం ఉద్దేశమని తమ్మినేని స్పష్టం చేశారు.