కొహిమా : నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ వేగవంతం చేసింది. 20 ఏండ్లుగా ఈశాన్య రాష్ట్రాలను పాలించిన పార్టీలు ఎలాంటి అభివృద్ధీ చేపట్టలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఎన్డీపీపీ, ఎన్పీఎఫ్, బీజేపీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పార్టీలు రెండు దశాబ్ధాలుగా నాగాలాండ్ను లూటీ చేశాయని ఎన్నికల ప్రచార సభలో ఖర్గే నిప్పులు చెరిగారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ఓటర్లకు పిలుపు ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు రూ. 3000 ఫించన్తో పాటు స్దానిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పధకం కార్డుదారులకు నూరు శాతం వేతనాలు చెల్లిస్తామని, ఉన్నత విద్య కోసం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
సురక్షిత మంచినీరు, శానిటేషన్ కల్పిస్తామని చెప్పారు. 60 మంది సభ్యులు కలిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 27న జరగనుండగా మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో నాగాలాండ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.