కాంగ్రెస్ పార్టీ శనివారం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఆయన తన వ్యాఖ్యలతో పార్లమెంటుని అవమానించారని శనివారం సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు.
జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన నాలుగు నెలలకే రాజ్య సభ సభ్యత్వం పొందారు. అప్పటి నుంచి ఆయన పార్లమెంటు సమావేశాలకు సరిగా హాజరు కావడంలేదు. ఆయన అటెండెన్స్ 10 శాతం కూడా లేకపోవడంతో గొగోయ్పై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జస్టిస్ గొగోయ్ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను రాజ్యసభకు వెళ్తాను. నేను మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయాలుంటే నేను తప్పని సరిగా.. ప్రస్తుతం ఆ అవసరం లేదు” అని అన్నారు.
జస్టిస్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ కాంగ్రెస్ నేత జై రాం రమేష్ ఒక ట్వీట్ చేశారు. గొగోయ్ తన మాటలతో పార్లమెంటుని అవమానించారని అన్నారు. రాజ్యసభ కేవలం మనం మాట్లాడడానికే కాదని.. ఎదుటి వ్యక్తులు చెప్పే విషయాలు వినడానికి కూడా అని ఆయన చెప్పాడు.