న్యూఢిల్లీ : వంట గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బుధవారం విమర్శలు గుప్పించింది. ఎల్పీజీ సిలిండర్లు భారం కావడంతో వంటింటి బడ్జెట్లు తలకుమించిన భారంలా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. గ్యాస్ ధరల భారానికి సంకేతంగా ఆ పార్టీ విలేకరుల సమావేశంలో ఖాళీ సిలిండర్లను ప్రదర్శించింది.
దేశంలో సామాన్యులకు ఊరట కల్పించేలా ఎల్పీజీ సిలిండర్ల ధరను తగ్గించాలని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిలిండర్పై రూ 25 పెంచడంతో ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ 860 పలుకుతుండగా దేశంలోని పలు ప్రాంతాల్లో రూ 1000కి చేరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గించి సామాన్యుడికి ఊరట కల్పించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
గ్యాస్ ధరలను సౌదీ ఆరాంకో ప్రభావితం చేస్తుందని ఆ ప్రకారం సిలిండర్ ధర రూ 600 కాగా తాము అధికంగా రూ 260 ఎందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించారు. ఎల్పీజీ సిలిండర్లపై ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ చెల్లించడం లేదని మార్కెట్ ధరకు, నియంత్రిత ధరలకు ఎలాంటి వ్యత్యాసం లేదని పేర్కొన్నారు. ఆర్ధిక సంక్షోభంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోతూ ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న సమయంలో వంట గ్యాస్ ధరల భారాన్ని మోసే పరిస్ధితిలో వారు లేరని ప్రభుత్వం గ్రహించలేకపోవం దురదృష్టకరమని అన్నారు.
ఇక ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రతినెలా పెంచుతూ మోదీ ప్రభుత్వం ఖజానాను నింపుకుంటోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. మరోవైపు ఎల్పీజీ ధరలను తగ్గించడం చేతకాని పక్షంలో ప్రధాని రాజీనామా చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అమృత ధావన్ డిమాండ్ చేశారు.